manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 11:18 am Editor : manabharath

పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలి..

మన భారత్, నాగర్ కర్నూల్: 

మండలం పరిధిలోని లింగసానిపల్లి, వెంకటాపూర్ గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు వెంటనే కనీస వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు గుంపల్లి అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయా గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన సందర్శించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, గత రెండు నెలలుగా ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ఇప్పటివరకు కూలి చెల్లింపులు జరగలేదని తెలిపారు. కూలీలు కష్టపడి పని చేసినప్పటికీ వారికి రావాల్సిన డబ్బులు ఆలస్యమవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పండుగ సమయాల్లో కూడా కూలీలు కూలి రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నిర్ణయించిన కనీస కూలి రూ.307 ఉన్నప్పటికీ, కూలీలకు అదనంగా రావాల్సిన చెల్లింపులు కూడా చేయడం లేదని ఆయన ఆరోపించారు. వెంటనే బకాయి కూలి చెల్లింపులు విడుదల చేసి కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అలాగే పని ప్రదేశాల్లో కూలీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అశోక్ పేర్కొన్నారు. ముఖ్యంగా మంచినీటి సౌకర్యం, టెంటు ఏర్పాటు, మెడికల్ కిట్ వంటి కనీస సదుపాయాలు అందుబాటులో ఉంచాలని కోరారు. పని ప్రదేశాల్లో ఈ సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమని, కూలీల ఆరోగ్యం, భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు శ్రీశైలం, మహేష్, వెంకటమ్మ, నాగేష్, రాములు, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.