మన భారత్, తెలంగాణ:
తెలంగాణలో ప్రజలకు వైద్య సేవలను మరింత సులభంగా అందించేందుకు ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ఇందుకు భాగంగా త్వరలోనే ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp ద్వారా పలు రకాల ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సేవలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ (Out Patient) రిజిస్ట్రేషన్ చేయడం, హెల్త్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడం వంటి సేవలు ప్రజలకు సులభంగా లభించనున్నాయి. దీనివల్ల ఆస్పత్రుల వద్ద క్యూ లైన్లు తగ్గి, ప్రజలకు సమయం ఆదా అవుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఈ సేవలను పొందాలంటే ప్రభుత్వం అందించే ప్రత్యేక నంబర్కు “HI” అని మెసేజ్ పంపాలి. అనంతరం Ayushman Bharat ID మరియు ఆధార్ వివరాలను వెరిఫై చేయాలి. తర్వాత అవసరమైన ఆస్పత్రిని ఎంపిక చేసుకుని సంబంధిత సేవలను పొందవచ్చు.

ఇక ప్రజలు ఆస్పత్రి సేవలపై తమ అభిప్రాయాలను ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయడంతో పాటు, సమస్యలు ఉంటే ఫిర్యాదులు కూడా నమోదు చేసుకునే అవకాశం ఈ విధానంలో కల్పించనున్నారు.

మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1000 ఆస్పత్రుల్లో ఈ సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవస్థ పూర్తిగా అమల్లోకి వస్తే ప్రజలకు వైద్య సేవలు మరింత వేగంగా, సౌకర్యవంతంగా అందే అవకాశం ఉందని భావిస్తున్నారు.
