manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 1:36 am Editor : manabharath

వడదెబ్బతో మరణిస్తే రూ.4 లక్షల పరిహారం..

మన భారత్ , తెలంగాణ:

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడే ఎండాకాలం ప్రారంభమైనప్పటికీ ఉష్ణోగ్రతలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడి తాపం తీవ్రంగా ఉండడంతో ప్రజలు బయటకు రావడానికే ఆలోచించే పరిస్థితి నెలకొంది. సాయంత్రం వరకు ఎండలు కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వాతావరణశాఖ హెచ్చరికల ప్రకారం రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా మార్చి నెల చివరి నాటికి ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని సూచించారు.

ఇక వడదెబ్బ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించింది. గతంలో వడదెబ్బతో మరణించిన కుటుంబాలకు కేవలం రూ.50 వేల సాయం మాత్రమే అందించేవారు. ప్రస్తుతం ఆ మొత్తాన్ని భారీగా పెంచి రూ.4 లక్షలకు పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

వడదెబ్బ మరణాల ధృవీకరణకు త్రిసభ్య కమిటీ

ప్రతీ మండలంలో వడదెబ్బ కారణంగా జరిగిన మరణాలను నిర్ధారించేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎమ్మార్వో, ప్రభుత్వ వైద్య అధికారి, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై సభ్యులుగా ఉంటారు. ఎవరైనా వడదెబ్బ కారణంగా మరణించినట్లు సమాచారం అందిన వెంటనే ఈ కమిటీ పరిశీలన చేపడుతుంది.

బాధితుడు వడదెబ్బ కారణంగా మరణించినట్లు వైద్యులు డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అనంతరం కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహిస్తారు. తర్వాత పోస్ట్‌మార్టం నివేదికలో వడదెబ్బ వల్లే మరణించినట్లు నిర్ధారణ కావాలి.

పరిహారం పొందే విధానం..

పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ కాపీ, పోస్ట్‌మార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికేట్ వంటి పత్రాలను స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో కుటుంబ సభ్యులు సమర్పించాలి. త్రిసభ్య కమిటీ ఈ వివరాలను పరిశీలించి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపుతుంది. వారి ఆమోదం అనంతరం బాధిత కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందజేస్తారు.

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండడం, ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.