మన భారత్ , ఆదిలాబాద్:
రైతులు రెండు రకాల పురుగు మందులను కలిపి వాడటం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బీసీఐ (BCI) మరియు కేశవాపూర్ ఎఫ్పీసీఎల్ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు పురుగుమందుల సరైన వినియోగంపై వివరించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రైతులు ఒకేసారి రెండు రకాల పురుగుమందులను కలిపి పిచికారీ చేయడం వల్ల పురుగులపై సరైన ప్రభావం ఉండదని తెలిపారు. అంతేకాకుండా రైతులకు ఖర్చులు కూడా అధికమవుతాయని చెప్పారు. అనవసరంగా పురుగుమందులు వాడడం వల్ల నేల సారానికి నష్టం కలగడమే కాకుండా పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.

అధికంగా రసాయన పురుగుమందులు వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమయ్యే ప్రమాదం ఉందని రైతులకు సూచించారు. రైతులు రసాయనాలపై ఆధారపడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.

అలాగే రైతులకు “క్యాలెండర్ స్ప్రే” మరియు “రాండమ్ స్ప్రే” పద్ధతుల మధ్య తేడాను వివరించి, అవసరమైనప్పుడు మాత్రమే పురుగుమందులు ఉపయోగించాలని అవగాహన కల్పించారు. పురుగుమందులు మరియు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అంకిత, స్వామి, సుభాష్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు, రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
