manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 8:24 am Editor : manabharath

బాబోయ్ ఎండలు.. మూడు రోజులు జాగ్రత్త.!

మన భారత్, తెలంగాణ:

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు.

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ, నేటి నుంచి మూడు రోజుల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావడం నివారించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, లేకపోతే ఇంట్లోనే ఉండి ఎండ తీవ్రత నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

అధిక ఉష్ణోగ్రతల కారణంగా డీహైడ్రేషన్, తలనొప్పి, అలసట, వడదెబ్బ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగడం, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలను తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

అలాగే ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా గుడ్డ కట్టుకోవడం, లేత రంగు దుస్తులు ధరించడం, పిల్లలు మరియు వృద్ధులు ఎక్కువసేపు ఎండలో ఉండకుండా జాగ్రత్త పడాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో వేసవి ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.