చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – ఉత్తమ నటీనటులుగా నాగచైతన్య, రష్మిక మందన్న
మన భారత్ తెలంగాణ:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025” విజేతలను అధికారికంగా ప్రకటించింది. తెలుగు సినిమా పరిశ్రమలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను అందజేయనున్నారు. మార్చి 19, 2026న ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్లో ఈ అవార్డు వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది.

శనివారం అవార్డు జ్యూరీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల తుది జాబితాను అందజేశారు. అనంతరం అవార్డు కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ మీడియా సమావేశంలో విజేతల పేర్లను ప్రకటించారు. తెలుగు సినీ రంగంలో విశేష సేవలందించిన ప్రముఖులకు ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రత్యేక అవార్డులు
ఈ ఏడాది గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో పలువురు సినీ ప్రముఖులు ప్రత్యేక పురస్కారాలకు ఎంపికయ్యారు.
మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్కు నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు, దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావుకు బీఎన్ రెడ్డి అవార్డు వరించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు, నటి జయసుధకు అక్కినేని స్పెషల్ (ఫిమేల్) అవార్డు ప్రకటించారు.

అదేవిధంగా ప్రముఖ గేయరచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు, రమేష్ ప్రసాద్కు రఘుపతి వెంకయ్య అవార్డు, ప్రజా చిత్రాల దర్శకుడు ఆర్. నారాయణమూర్తికి కాంతారావు అవార్డు వరించింది.
ప్రధాన అవార్డు విజేతలు
ఈ ఏడాది ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్) ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్) అవార్డు అందుకోనున్నారు.
ఉత్తమ చిత్రంగా “రాజు వెడ్స్ రాంబాయి”, ఉత్తమ ద్వితీయ చిత్రంగా “దండోరా”, ఉత్తమ తృతీయ చిత్రంగా “ది ప్రీ వెడ్డింగ్ షో” ఎంపికయ్యాయి.
జాతీయ సమైక్యతపై ఉత్తమ చిత్రంగా “తండేల్” ఎంపిక కాగా, పర్యావరణ అంశంపై ఉత్తమ చిత్రంగా “ఇగ్వా” నిలిచింది.
ఇతర ముఖ్య అవార్డులు
ఉత్తమ వినోదాత్మక చిత్రంగా “సంక్రాంతికి వస్తున్నాం”, ఉత్తమ సామాజిక సందేశం కలిగిన చిత్రంగా “కోర్టు”, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీగా “మిరాయ్”, ఉత్తమ బాలల చిత్రంగా “అనగనగా” ఎంపికయ్యాయి.
ఉత్తమ దర్శకుడిగా “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రానికి సాయిలు అవార్డు పొందారు.

నటన, సాంకేతిక విభాగాలు
సపోర్టింగ్ నటుడిగా శివాజీ, సపోర్టింగ్ నటిగా భూమిక ఎంపికయ్యారు. సంగీత దర్శకుడిగా మార్క్ కె రాబిన్ (దండోరా), ఉత్తమ నేపథ్య గాయకుడిగా అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి) ఎంపికయ్యారు.
ఉత్తమ నేపథ్య గాయని సాహితి చాగంటి (కన్నప్ప), హాస్యనటుడిగా కృష్ణ తేజ (జిగ్రీస్) అవార్డులు అందుకోనున్నారు.
బాలనటుడిగా రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో), కథా రచయితగా గుణశేఖర్ (యుఫోరియా), స్క్రీన్ ప్లే రచయితగా అనిల్ రావిపూడి ఎంపికయ్యారు. గేయరచయితగా నందకిశోర్ (కుబేర) అవార్డు దక్కించుకున్నారు.

సాంకేతిక విభాగాల్లో అవార్డులు
సినిమాటోగ్రాఫర్గా కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్), ఎడిటర్గా శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్), ఆడియోగ్రాఫర్గా ఎం.ఆర్. రాధాకృష్ణన్ (కిష్కిందపురి) ఎంపికయ్యారు. కొరియోగ్రాఫర్గా ఆట సందీప్ (గిర గిర గిర పాట) అవార్డు అందుకోనున్నారు.
ఆర్ట్ డైరెక్టర్గా తోట తరణి (చాంపియన్), మేకప్ ఆర్టిస్ట్గా గోవింద్ (అఖండ), కాస్ట్యూమ్ డిజైనర్గా చంద్రకాంత్ (చాంపియన్) ఎంపికయ్యారు.
అదేవిధంగా స్పెషల్ జ్యూరీ ఫిల్మ్గా “23”, స్పెషల్ జ్యూరీ హీరోగా రోషన్ (చాంపియన్) అవార్డులు పొందనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ద్వారా తెలుగు సినిమా రంగంలోని ప్రతిభను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని అవార్డు కమిటీ పేర్కొంది.
