మన భారత్, ప్రత్యేక ప్రతినిధి:
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న గల్ఫ్ ప్రాంత ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వంటగదికి సంబంధించిన అవసరాలపై ధరల మంట పెరుగుతోంది. ఇటీవల వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.

ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషించే Qatar నుంచి భారత్ తో పాటు Japan, China మరియు పలు Europe దేశాలకు భారీగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సరఫరా అవుతుంది. అయితే గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తమ ఉత్పత్తి కేంద్రాల్లో ప్రొడక్షన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఖతర్ ఇటీవల ప్రకటించింది.

దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటికే యూరప్, ఆసియా దేశాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. అదే ప్రభావం ఇప్పుడు భారతదేశం పైనా పడుతోంది. వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో గృహిణులు, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ పరిస్థితులు స్థిరపడే వరకు ఇంధన ధరల్లో మార్పులు కొనసాగుతాయని చెబుతున్నారు. గల్ఫ్ ప్రాంత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తేనే ధరలు తగ్గే అవకాశముందని భావిస్తున్నారు.

సాధారణంగా వంటగ్యాస్, ఇంధన ధరలు పెరిగితే దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరల పైనా పడే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Mana Bharath – Leading News Portal
