మన భారత్, తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో నడుస్తున్న అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేసే బాధ్యతను జిల్లా విద్యాశాఖాధికారులకు (డీఈవోలకు) అప్పగించారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది.

రాష్ట్రంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల వ్యవహారం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అనేక పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 11 వేల ప్రైవేట్ స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రతి పాఠశాలలో తీసుకుంటున్న ట్యూషన్ ఫీజు, ఇతర చార్జీల వివరాలను సమగ్రంగా పరిశీలించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

ఫీజులపై నియంత్రణ విధించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించే పనిలో ప్రభుత్వం ఉందని సమాచారం. ఫీజుల విషయంలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల్లో చర్చ మొదలైంది. ఇకపై ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లింపు మరియు ఫీజుల నియంత్రణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని విద్యావర్గాలు భావిస్తున్నాయి.
