manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 10:23 pm Editor : manabharath

చెట్టు నీడనే బస్టాండ్.!

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో బస్టాండ్ సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంగా ఉన్న తలమడుగు ప్రాంతానికి పరిసర గ్రామాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల పనుల కోసం వస్తున్నారు. అయితే ఇక్కడ సరైన బస్టాండ్ లేదా బస్సు షెల్టర్ లేకపోవడంతో ఎండలో, వర్షంలో బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ముఖ్యంగా ఎంఆర్వో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, మీ సేవ కేంద్రాలు, ఐకేపీ కార్యాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాలకు పనుల నిమిత్తం తరచూ వస్తుంటారు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మండల కేంద్రంలో ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికుల రద్దీ కూడా గణనీయంగా ఉంటుంది.

ఇప్పటికే పలుమార్లు స్థానిక ప్రజలు, గ్రామస్తులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు బస్టాండ్ నిర్మాణం కోసం వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎండాకాలం ప్రారంభం కావడంతో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు చెట్ల నీడలో లేదా రోడ్డుపక్కన నిలబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

మండల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న తలమడుగులో కనీస బస్సు షెల్టర్ కూడా లేకపోవడం బాధాకరమని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తలమడుగు మండల కేంద్రంలో ఆధునిక సౌకర్యాలతో బస్టాండ్ నిర్మించాలని స్థానికులు, ప్రయాణికులు, విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.

Mana Bharath, Leading News Portal 

సమస్య మీది.. పరిష్కారం మన అందరిదీ