మన భారత్ ,ఆదిలాబాద్:
గుడిహత్నూర్ మండలంలోని సూర్యగూడ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన ఫైనల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గుడిహత్నూర్ కాంగ్రెస్ పార్టీ ఆశావహ ZPTC అభ్యర్థి ఉర్వేత్త రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు–ఓటములు సహజమని, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో జరిగే క్రీడా పోటీలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడల వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

టోర్నమెంట్లో విజేతలకు ఉర్వేత్త రోహిత్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యగూడ సర్పంచ్ షైక్ రహీమ్, ఉమ్రీ సర్పంచ్ అర్క భరత్, గ్రామ పెద్దలు పటేల్, దేవారి, మహాజన్ తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి పోటీలు తరచూ నిర్వహించాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.
