భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / మన భారత్:
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుని కలకలం రేగింది. పరీక్ష రాయడానికి వచ్చిన ఓ 16 ఏళ్ల ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి అకస్మాత్తుగా అనారోగ్యం కలగడంతో పరీక్షా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం ప్రకారం, పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యార్థిని కడుపునొప్పితో బాధపడుతూ బాత్రూంకి వెళ్లింది. అయితే, కొంతసేపటి తరువాత కూడా తిరిగి పరీక్షా హాల్లోకి రాకపోవడంతో మహిళా ఇన్విజిలేటర్ అనుమానంతో సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ క్రమంలో బాత్రూంలో గర్భస్రావం జరిగినట్లు గుర్తించారు.
ఘటనపై వెంటనే కేంద్ర సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని విద్యార్థినిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె సుమారు ఐదు నెలల గర్భవతి అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ఈ సంఘటనతో పరీక్షా కేంద్రంలో ఆందోళన నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థిని ఎలా గర్భవతి అయింది? కుటుంబ సభ్యులకు విషయం తెలుసా? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
అయితే, మైనర్కు సంబంధించిన విషయం కావడంతో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
