‘రైల్ పార్సిల్ యాప్’ ప్రారంభించిన South Central Railway – దేశంలోనే తొలి పైలట్ ప్రాజెక్ట్
మన భారత్, న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో లాజిస్టిక్స్ రంగంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టుతూ దక్షిణ మధ్య రైల్వే ‘రైల్ పార్సిల్ యాప్’ను ప్రారంభించింది. ఇంటి వద్ద నుంచే పార్సిల్ బుకింగ్, ట్రాకింగ్, డెలివరీ సౌకర్యాలను అందించే ఈ యాప్ దేశవ్యాప్తంగా పార్సిల్ సేవల్లో కొత్త దశకు నాంది పలుకుతోంది.
సికింద్రాబాద్లో జరిగిన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ Sanjay Kumar Srivastava ఈ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో ఈ యాప్ను అభివృద్ధి చేయడం విశేషం.
మొదటగా 7 నగరాల్లో సేవలు
‘రైల్ పార్సిల్ యాప్’ను తొలి దశలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రారంభించారు. భారతీయ రైల్వేలో తొలిసారిగా ఈ పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్ డివిజన్లో అమలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
దక్షిణ మధ్య రైల్వే మూడు లాజిస్టిక్స్ భాగస్వాములతో కలిసి డోర్ టు డోర్, మిడ్ మైల్, మెయిన్ డెలివరీ సేవలను అందించనుంది. దీంతో చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు, వ్యక్తిగత వినియోగదారులకు రవాణా సులభతరం కానుంది.
ఇంటి వద్ద నుంచే పార్సిల్ బుకింగ్
జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, ప్రజలు తమ ఇంటి నుంచే పార్సిల్ బుకింగ్ చేయగలరని, అలాగే పార్సిల్ ట్రాకింగ్ సదుపాయం కూడా ఈ యాప్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. వేగవంతమైన, పారదర్శకమైన సేవల కోసం డిజిటల్ ప్లాట్ఫాం రూపంలో ఈ యాప్ను రూపొందించామని పేర్కొన్నారు.
ఇక దక్షిణ మధ్య రైల్వే ఫ్రైట్ లాజిస్టిక్స్ మార్కెట్పై అధ్యయనం చేయడానికి Indian Institute of Management Bangaloreతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.
వన్స్టాప్ డిజిటల్ వేదిక
‘రైల్ పార్సిల్ యాప్’ ఫస్ట్ మైల్ (పికప్), మిడ్ మైల్ (రైల్వే ద్వారా రవాణా), లాస్ట్ మైల్ (డెలివరీ) సేవలను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానిస్తుంది. పరిశ్రమలు, వ్యాపారులు, వినియోగదారులు, లాజిస్టిక్స్ భాగస్వాములను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ యాప్ లక్ష్యంగా పేర్కొన్నారు.
ఈ కొత్త ప్రయత్నంతో భారతీయ రైల్వే పార్సిల్ సేవల్లో సరికొత్త ప్రమాణాలను సృష్టించనుంది. డిజిటల్ ఇండియా దిశగా మరో ముందడుగు అని అధికారులు భావిస్తున్నారు.
