ప్రేమ నిరాకరణే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణ వెల్లడి
మన భారత్ ,హైదరాబాద్ క్రైమ్ న్యూస్:
తెలంగాణలో యువ యూట్యూబర్ కోమలి(21) ఆత్మహత్య ఘటనపై పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. Hyderabad నగరంలోని మణికొండ చిత్రపురి కాలనీలో తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రేమ వ్యవహారమే కారణమా?
ఈ కేసుపై స్పందించిన Raidurgam Police Station ఇన్స్పెక్టర్ వెంకన్న మాట్లాడుతూ.. కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. కోమలి, అఖిల్ ఇద్దరూ విశాఖపట్నానికి చెందినవారని, అక్కడే పరిచయం ఏర్పడిందని తెలిపారు.
తరువాత కోమలి చదువు నిమిత్తం, అఖిల్ ఉద్యోగ కారణంగా హైదరాబాద్కు వచ్చారని చెప్పారు. కోమలి తన ప్రేమను అఖిల్కు వ్యక్తం చేయగా, అతను ఇప్పటికే వేరే యువతితో సంబంధంలో ఉన్నందున నిరాకరించినట్లు తెలిపారు.
ఆరు నెలల క్రితం ఆత్మహత్యాయత్నం
సుమారు ఆరు నెలల క్రితం కోమలి ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు విచారణలో తెలిసిందన్నారు. అదే సమయంలో ఆమె అఖిల్ను ప్రేమిస్తున్న విషయం కుటుంబ సభ్యులకు తెలిసిందని చెప్పారు. కోమలి తల్లి అఖిల్ను పెళ్లి చేసుకోవాలని కోరినా, అతను అంగీకరించలేదని ఇన్స్పెక్టర్ వెల్లడించారు.
చివరి భేటీ తర్వాత తీవ్ర నిర్ణయం
ఆత్మహత్యకు ముందు అఖిల్ను మాట్లాడదామని కోమలి పిలిచిందని, ఆ సమయంలో కూడా ప్రేమ విషయాన్ని ప్రస్తావించగా మరోసారి అతను నిరాకరించినట్లు తెలిపారు. తన ప్రేమను అఖిల్ అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై కోమలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆమె డైరీలో కూడా రాసుకుందని తెలిపారు.
కేసు నమోదు చేసే అవకాశముందా?
ఈ ఘటనలో అఖిల్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభిస్తే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ వెంకన్న స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన యువతలో భావోద్వేగ సమస్యలపై మళ్లీ చర్చకు దారితీసింది. సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
