manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 11:53 am Editor : manabharath

మూల మలుపులు.. నరకానికి పిలుపులు.!

– తాంసి అంతరాష్ట్ర రహదారిపై వరుస ప్రమాదాలు

-వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

మన భారత్, తాంసి:

తాంసి మండలంలోని అంతరాష్ట్ర రహదారిపై ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మూలమలుపులు అధికంగా ఉండడం, రహదారి ఇరువైపులా ముళ్ళపొదలు విస్తరించడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు ప్రయాణికులకు ప్రాణహానికరంగా మారుతున్నాయని వారు చెబుతున్నారు.

ప్రత్యేకంగా సాయంత్రం, రాత్రి వేళల్లో పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం, వీధి దీపాల ఏర్పాటు లేకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఢీకొని పలువురు గాయపడిన ఘటనలు నమోదవుతున్నాయి.

ఇక పొచ్చెర బ్రిడ్జి పరిసరాల్లో రహదారి గుంతలతో నిండిపోయి ఉంది. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో అవి కనిపించకుండా ప్రమాదాలకు దారితీస్తున్నాయి. భారీ వాహనాలు వెళ్లే సమయంలో చిన్న వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రహదారి దెబ్బతిన్న కారణంగా ట్రాఫిక్ కూడా మందగించి, ప్రయాణ సమయం పెరుగుతోంది.

స్థానిక ప్రజలు, వాహనదారులు వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టాలని, ముళ్ళపొదలను తొలగించాలని, ప్రమాదకర మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు మరియు రిఫ్లెక్టర్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.

ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఈ రహదారి సమస్యలను పరిష్కరించడంలో ఆలస్యం చేస్తే మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశముందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.