మురికినీటి కాలువలు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, పార్క్ అభివృద్ధికి హామీ
మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని 12వ వార్డు పరిధిలో ఉన్న సమస్యలపై మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వివరించారు. ముఖ్యంగా యువ నాయకుడు జాదవ్ శ్రావణ్ నాయక్ ఆధ్వర్యంలో కాలనీవాసుల తరఫున పలు సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు.
న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, భగవతి నగర్, అగ్రజా టౌన్షిప్, ఆదిత్య నగర్ ప్రాంతాల్లో మురికినీటి కాలువల సమస్య, డ్రైనేజీ లోపాలు, వీధి విద్యుత్ దీపాల కొరత, పార్క్ అభివృద్ధి వంటి అంశాలు తీవ్రంగా ఉన్నాయని ప్రతినిధులు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిశీలించి అతి త్వరలోనే పరిష్కార చర్యలు చేపడతానని చైర్పర్సన్ బండారి అనూష సతీష్ హామీ ఇచ్చారు.

కాలనీవాసులకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. ముఖ్యంగా మురికినీటి కాలువల శుభ్రత, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ, సరిపడా వీధి దీపాల ఏర్పాటు, పార్క్ అభివృద్ధి కార్యక్రమాలు దశలవారీగా చేపడతామని వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్లో భాగంగా కాలనీల్లో పర్యటించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు శ్రావణ్ నాయక్ మాట్లాడుతూ, 12వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి కొనసాగుతుందని అన్నారు. ప్రజల సహకారంతో ప్రతి కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాష్, భాస్కర్ గౌడ్, రవీందర్, రాములు, స్వామి, నరేందర్, అరుణ్, విట్టర్, శివన్న, సూర్య కుమార్, అరుణ, సంజీవని తదితరులు పాల్గొన్నారు.
