మన భారత్, ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత వెల్లడించారు. సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ ప్రక్రియలో భాగంగా మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించినట్లు తెలిపారు. కమిషన్ సమగ్ర అధ్యయనం చేసి సమర్పించే నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల అమలు చేపడతామని చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని, వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని మంత్రి సవిత పేర్కొన్నారు. గత ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి పరిమితం చేసిందని విమర్శించారు.
రాష్ట్రంలో సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కమిషన్ సిఫార్సుల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీల పాత్ర పెరగడం ద్వారా గ్రామీణ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
రాజకీయ వర్గాల్లో ఈ ప్రకటన చర్చనీయాంశమైంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు కమిషన్ నివేదిక సమర్పించనున్నట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.
