తెలంగాణ బడ్జెట్లో కీలక ప్రకటనకు ముహూర్తం ఫిక్స్
మన భారత్, తెలంగాణ:
తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, సామాజిక భద్రత పింఛన్లను రూ.4,000కు పెంచే అంశంపై ప్రభుత్వం తుది కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో 28న ప్రవేశపెట్టనున్న 2026-27 వార్షిక బడ్జెట్లో ఈ అంశాలపై ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. సమావేశాల తొలి రోజున రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తదుపరి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఈసారి సభను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖలవారీగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి బడ్జెట్ రూపకల్పనపై చర్చలు జరిపారు. సంక్షేమం, అభివృద్ధి రంగాలకు పెద్దపీట వేయాలనే దిశగా కేటాయింపులు ఉండే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
పెండింగ్ హామీల అమలుపై దృష్టి
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పెండింగ్ హామీల అమలు దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, ప్రస్తుత పింఛన్లను రూ.4,000కు పెంపు వంటి అంశాలు బడ్జెట్లో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.
అదేవిధంగా రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు కూడా భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది. నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి రంగాలపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై అధికారిక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలుపై బడ్జెట్లో కీలక ప్రకటనలు వెలువడే అవకాశముండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
