మన భారత్, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాబోయే బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కీలక చర్చలు జరగనున్నాయి.
శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, కొత్త పథకాల అమలు, ప్రాధాన్యతా రంగాలపై నిధుల పంపిణీ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా వివిధ శాఖల ప్రతిపాదనలను పరిశీలించనున్నారు.

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ముంబైకి వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు అక్కడ నిర్వహించనున్న ‘క్లైమేట్ వీక్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పెట్టుబడుల అవకాశాలపై ప్రసంగించనున్నారు.
రాష్ట్ర రాజకీయ, ఆర్థిక పరిణామాల దృష్ట్యా ఈ క్యాబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.