manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 12:49 am Editor : manabharath

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం

మన భారత్, కేరళ:

కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచగా, అదే సమయంలో ఐదుగురికి కొత్త జీవితం ప్రసాదించిన ఉదంతంగా మారింది. పది నెలల పసికందు అలిన్ షెరిన్ బ్రెయిన్ డెడ్ అయిన అనంతరం ఆమె అవయవాలను దానం చేయడంతో ఐదుగురికి ప్రాణాధారంగా నిలిచింది.

ఈ నెల 5న జరిగిన రోడ్డుప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించింది. నిన్న వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.

ఈ క్లిష్ట సమయంలోనూ చిన్నారి తల్లిదండ్రులు గొప్ప మనసుతో అవయవదానానికి అంగీకరించారు. వారి ఈ నిర్ణయంతో ఐదుగురికి కొత్త జీవితం లభించింది. దుఃఖ సమయంలోనూ మానవత్వాన్ని నిలబెట్టిన ఈ కుటుంబాన్ని సమాజం ప్రశంసిస్తోంది.

కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ మరియు ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ చిన్నారి తల్లిదండ్రుల నిర్ణయాన్ని అభినందించారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో అవయవదానం పట్ల అవగాహన పెంపొందించడానికి దోహదపడతాయని వారు పేర్కొన్నారు.

అలిన్ షెరిన్ చిన్న వయస్సులోనే ప్రపంచాన్ని విడిచిపెట్టినా, ఆమె అవయవదానం ద్వారా ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ సంఘటన అవయవదానం మహత్యాన్ని మరొక్కసారి చాటి చెబుతోంది.