మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ పట్టణంలోని 25వ వార్డు కౌన్సిలర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బొంపల్లి రేవతి విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం రేవతికి 719 ఓట్లు పోలవ్వగా, సమీప ఎంఐఎం అభ్యర్థి సల్మా పర్వీన్కు 393 ఓట్లు వచ్చాయి. దీంతో 326 ఓట్ల మెజార్టీతో రేవతి గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఈ ఫలితంతో 25వ వార్డులో బీజేపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. విజయం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు రేవతిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని రేవతి పేర్కొన్నారు.
ప్రత్యేకంగా తాగునీటి సమస్యలు, పారిశుధ్యం, రహదారుల మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటుపై దృష్టి సారిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పారదర్శకంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
25వ వార్డు ఫలితం ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.