manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 8:41 pm Editor : manabharath

తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు కేటాయింపు.. బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యంతోనే: కిషన్‌రెడ్డి

మన భారత్, తెలంగాణ:

కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న విమర్శలను కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఖండించారు. బడ్జెట్ ప్రకటనలను ఉచితాల కోసం మాత్రమే చేశారంటూ ప్రజల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఈ బడ్జెట్ ఎన్నికల కోసం కాదని, వికసిత భారత్ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని ఆయన స్పష్టం చేశారు.

పీఎం ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 4.30 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దీని ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు స్వంత ఇంటి కల నెరవేరుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సమతుల్యంగా ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

అలాగే జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు మౌలిక వసతులు విస్తరించడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, పరిశ్రమల అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని చెప్పారు.

కేంద్ర బడ్జెట్‌లో దేశ అభివృద్ధికి అవసరమైన రంగాలన్నింటికీ సముచిత నిధులు కేటాయించామని, ప్రజలకు ఉపయోగపడే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు నమ్మకం ఉంచాలని కిషన్‌రెడ్డి కోరారు.