manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 7:53 pm Editor : manabharath

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం.. తొలిరోజే రూ.2.49 కోట్ల ఆదాయం!

మన భారత్, హనుమకొండ:
ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు ప్రక్రియ హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానాల కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమైంది. భక్తుల విరాళాలతో నిండిన హుండీలను లెక్కించే కార్యక్రమం అధికారులు పర్యవేక్షణలో కొనసాగుతోంది.

తొలి రోజున 125 హుండీలను లెక్కించగా, రూ.2.49 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపు పనుల కోసం సుమారు 500 మంది సిబ్బందిని నియమించారు. పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ప్రక్రియను చేపడుతున్నారు.

మేడారం జాతర సందర్భంగా మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేయగా, వాటి లెక్కింపును 10 రోజుల పాటు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం హుండీల్లో వచ్చిన నగదు, చిల్లర, బియ్యం తదితర వస్తువులను వేర్వేరుగా పరిశీలించి నమోదు చేస్తున్నారు.

హుండీల్లో నాణేలు అధికంగా ఉండటంతో వాటిని ప్రత్యేకంగా వేరు చేసి లెక్కిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల విశేషమైన విరాళాలతో మేడారం జాతర ఆదాయం భారీగా నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

భక్తుల శ్రద్ధాభక్తులకు నిదర్శనంగా మేడారం హుండీ ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతుండటంతో, ఈ నిధులను జాతర నిర్వహణ, ఆలయ అభివృద్ధి, సౌకర్యాల మెరుగుదలకు వినియోగించనున్నట్లు సమాచారం.