మన భారత్, తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తొలి విడతగా రూ.259.36 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది.
కేంద్ర మంత్రులు జి. కిషన్రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ చూపి కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఈ నిధులు కొత్త ఊపిరిని అందించనున్నాయి.
రాష్ట్రంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికావడం, నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో పంచాయతీల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా సర్పంచ్లు ఉన్న పంచాయతీలకే నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. తాజాగా ఎన్నికలు పూర్తవడంతో ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది.
పంచాయతీలకు అందిన ఈ నిధులను ప్రధానంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సరఫరా వంటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయని అధికారులు భావిస్తున్నారు.