మన భారత్, న్యూడిల్లీ:
ప్రధాన మంత్రి శ్రీ (PM SHRI) పథకం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఏ మేరకు మెరుగుపడ్డాయి? ఈ పథకంపై ఇప్పటివరకు ఎలాంటి మూల్యాంకనం నిర్వహించారు? అలాగే భవిష్యత్తులో PM శ్రీ పథకాన్ని మరిన్ని పాఠశాలలకు విస్తరించే ఆలోచన ఉందా? అంటూ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఈ రోజు పార్లమెంట్లో ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన విద్య, ఆధునిక బోధనా పద్ధతుల అమలుతో విద్యార్థుల సర్వాంగీణ అభివృద్ధి సాధించడమే PM శ్రీ పథక ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ పథకం ద్వారా గణనీయమైన ప్రయోజనం చేకూరే అవకాశముందని పేర్కొన్నారు.
ఎంపీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో PM శ్రీ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలను ఈ పథకంలో చేర్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం PM శ్రీ పథకాన్ని అమలు చేస్తోందని, ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని ఎంపీ గోడం నగేష్ తెలిపారు.
