manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 3:51 pm Editor : manabharath

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిపై సునేత్రా పవార్ పేరు? రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం

మన భారత్, ముంబై:

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనపై పార్టీ అంతర్గతంగా చర్చ సాగుతున్నట్లు సమాచారం. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం జరగవచ్చని కొందరు నేతలు పేర్కొంటుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎన్సీపీ నేతలు భేటీ అయినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం, రాబోయే పూణే జిల్లా పరిషత్ ఎన్నికల వ్యూహం అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పార్టీకి కొత్త దిశానిర్దేశం అవసరమని భావిస్తున్న సీనియర్ నేతలు, సునేత్రా పవార్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే, సునేత్రా పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రిత్వ బాధ్యతలు అప్పగించే అంశం ప్రస్తుతం చర్చ స్థాయిలోనే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండటంతో, ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అధికారికంగా ప్రభుత్వం లేదా ఎన్సీపీ నుంచి ప్రకటన వెలువడితేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.