మన భారత్, తెలంగాణ:
ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఈసారి ఆదివాసీల సంప్రదాయ రుచిని ప్రతిబింబించే ఇప్ప పువ్వు లడ్డూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. గిరిజన సంస్కృతి, ఆహార సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ప్రత్యేక లడ్డూ జాతర సందడిలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖల ప్రోత్సాహంతో తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామానికి చెందిన సెర్ఫ్ మహిళలు ఈ ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేస్తున్నారు. నాలుగు రోజులపాటు ప్రత్యేక శిక్షణ పొందిన అనంతరం, ఆదిలాబాద్ ప్రాంతం నుంచి కిలో రూ.200కు ఇప్ప పువ్వును తెప్పించి లడ్డూలుగా తయారు చేస్తున్నట్లు వారు తెలిపారు.
తయారైన లడ్డూలను ఒక్కో ప్యాకెట్ను రూ.150 ధరకు జాతరలో విక్రయిస్తున్నామని సెర్ఫ్ మహిళలు పేర్కొన్నారు. సహజమైన పదార్థాలతో తయారైన ఈ లడ్డూలకు భక్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, దీనివల్ల తమకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి దోహదపడుతూ, వారి సంప్రదాయ వంటకాలను ప్రజలకు చేరువ చేస్తున్న ఈ ప్రయత్నం మేడారం జాతర ప్రత్యేకతను మరింత పెంచుతోంది.