మన భారత్, ఆంధ్ర ప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వంలో ఏ వర్గానికీ మేలు జరగలేదని, ప్రజల ఆకాంక్షలు పూర్తిగా విస్మరించబడ్డాయని ఆయన ఆరోపించారు.
గత రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలుగా తేలాయని జగన్ అన్నారు. రాష్ట్ర ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన బదులు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల జేబుల్లోకి వెళ్లుతోందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తూ కొందరికి మాత్రమే లాభం చేకూరుస్తున్నారని ఆరోపించారు.
మద్యం విధానంపై కూడా జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు మద్యం దుకాణాలను తెరిపించి, వాటిని తన అనుకూల వ్యక్తులతో చంద్రబాబు నడిపిస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా బెల్టు షాపులను సైతం వేలం వేసి అమ్మినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారాల్లో పోలీసుల సహకారంతోనే అక్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని జగన్ ధ్వజమెత్తారు.
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదాయం ఉపయోగించాల్సిన బదులు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయాలపై ప్రజలు ఆలోచించాలని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని జగన్ పిలుపునిచ్చారు.
