మన భారత్, ఆదిలాబాద్:
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని ప్రసిద్ధ నాగోబా ఆలయంలో నిర్వహించిన జాతరకు భారీ ఆదాయం లభించింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టగా, మొత్తం జాతర ఆదాయం రూ.20,74,797గా నమోదైనట్లు దేవాదాయ శాఖ ఈవో ముక్త రవి తెలిపారు.
నాగోబా ఆలయంలో మెస్రం వంశీయులు, దేవాదాయ–ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. భక్తుల విశేష సహకారంతో తైబజార్ ద్వారా రూ.11,81,000 ఆదాయం లభించగా, హుండీ ద్వారా రూ.8,93,797 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
జాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు నాగోబా ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించారని, వారి భక్తి శ్రద్ధలకు ప్రతిబింబంగానే ఈ ఆదాయం వచ్చినట్లు తెలిపారు. జాతర నిర్వహణలో శాంతిభద్రతలు, ఏర్పాట్లకు సహకరించిన అన్ని శాఖలకు దేవాదాయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.