manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 9:53 pm Editor : manabharath

రాష్ట్రంలో ఐదుగురు డీఎస్పీల బదిలీకి ఉత్తర్వులు..

మన భారత్, హైదరాబాద్:

రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక బదిలీలు చోటు చేసుకున్నాయి. ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాలు, పనితీరు మెరుగుదల లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్ర పోలీస్ అకాడమీ స్టాండ్స్ డీఎస్పిగా, అలాగే ఇల్లందు ఎన్‌ఆర్‌పీఓగా విధులు నిర్వహిస్తున్న ఎస్. సారంగపాణిని వైరా ఏసీపీగా బదిలీ చేశారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో డీఎస్పిగా పని చేస్తున్న పద్మనాభుల శ్రీనివాస్‌ను జీహెచ్‌ఎంసీ అదనపు ఎస్పిగా నియమించారు.

ఇంటెలిజెన్స్ డీఎస్పిగా విధులు నిర్వహిస్తున్న యు. వెంకన్నబాబును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎస్‌డీపీఓగా బదిలీ చేశారు. సైబరాబాద్ ఎస్‌బీ ఏసీపీగా ఉన్న బి. ప్రకాష్‌ను నిజామాబాద్ ఏసీపీగా నియమించారు. ప్రస్తుతం నిజామాబాద్ ఏసీపీగా ఉన్న ప్రకాష్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ బదిలీలతో రాష్ట్ర పోలీస్ విభాగంలో పరిపాలనా పనితీరు మరింత సమర్థవంతంగా సాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.