మన భారత్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడానికి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఏఎస్ఐ గోకుల్ జాదవ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
తనిఖీల్లో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, హెల్మెట్, సీటుబెల్ట్ వంటి అంశాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రివేళల్లో మద్యం సేవించి వాహనం నడపడం, వేగం మించి డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని పేర్కొన్నారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని, వాహనదారుల సహకారంతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని ఏఎస్ఐ గోకుల్ జాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని తనిఖీలను సమర్థవంతంగా నిర్వహించారు.