manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 10:10 pm Editor : manabharath

కుమారుల మృతిని తట్టుకోలేక.. 20 రోజుల్లోనే దంపతుల ఆత్మహత్య

ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో గుండెలు పిండే విషాదం

మన భారత్ | తెలంగాణ

ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది నెలల క్రితం జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంలో కవల కుమారులను కోల్పోయిన తల్లిదండ్రులు, ఆ మనోవేదనను తట్టుకోలేక 20 రోజుల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.

మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్‌కుమార్‌ (36) అలియాస్ పండు, రేవతి దంపతులు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి తరుణ్‌, వరుణ్‌ అనే కవల కుమారులు ఉండగా, వారు స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ 28న ఇంట్లో వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వినోద్‌కుమార్‌తో పాటు ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే వారిని హైదరాబాద్‌లోని నిలోఫర్‌, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. తండ్రి వినోద్‌కుమార్‌ చికిత్సతో కోలుకోగా, చిన్నారులు తరుణ్‌, వరుణ్‌ మాత్రం చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 29న ఒకరు, 30న మరొకరు మృతి చెందారు. కవల పిల్లల మరణం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుదిపేసింది.

కుమారుల మృతితో తీవ్ర మనోవేదనకు లోనైన రేవతి గత డిసెంబర్‌ 27న ఆత్మహత్యాయత్నం చేయగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 1న మృతి చెందింది. భార్య, పిల్లలను కోల్పోయిన వినోద్‌కుమార్‌ తీవ్ర ఒంటరితనం, వేదనను భరించలేక ఈ నెల 7న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ గురువారం ఆయన కూడా మృతి చెందాడు.

ఒక ప్రమాదం కారణంగా తొమ్మిది నెలల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మిట్టపల్లి గ్రామం మొత్తం ఈ ఘటనతో కన్నీరుమున్నీరవుతోంది.