manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 9:59 pm Editor : manabharath

లక్కీ డ్రాల ముసుగులో మోసాలు..!

బెట్టింగ్ యాప్‌ల తర్వాత ‘లక్కీ డ్రా’ల కొత్త వేషం

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరిక

మన భారత్, తెలంగాణ :

బెట్టింగ్ యాప్‌ల మోసాలపై ఉక్కుపాదం మోపి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరోసారి ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై కఠిన చర్యలతో ఆ దందాకు దాదాపుగా బ్రేక్ పడటంతో, ఇప్పుడు కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు “లక్కీ డ్రా” పేరుతో కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కార్లు, బైకులు, ఖరీదైన మొబైళ్లు, గ్యాడ్జెట్లు ఇస్తామంటూ అమాయక ప్రజలను ఆకర్షించి, చిన్న మొత్తాల పేరుతో నగదు వసూలు చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని సీపీ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ మోసాలపై పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నట్లు వెల్లడించారు.

సోషల్ మీడియా వేదికగా అమాయకుల మోసం..

ఇటీవల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల్లో “లక్కీ డ్రా” పేరుతో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయని సజ్జనార్ పేర్కొన్నారు. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు తమ ఫాలోయింగ్‌ను ఉపయోగించి “డ్రాలో పాల్గొంటే కచ్చితంగా బహుమతి” అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి ఈ డ్రాలకు ఎలాంటి చట్టబద్ధత లేకపోవడం, బహుమతులు ఇవ్వకుండా ప్రజలను మోసం చేయడమే జరుగుతోందని స్పష్టం చేశారు.

లక్కీ డ్రాలు కాదు – ఇది నేరమే..

లక్కీ డ్రాల పేరుతో డబ్బులు వసూలు చేయడం, ప్రజలకు లాభాల ఆశ చూపించి మోసం చేయడం పూర్తిగా నేరమని సీపీ సజ్జనార్ తేల్చి చెప్పారు. ఈ తరహా కార్యకలాపాలు ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్, 1978 కింద నేరంగా పరిగణించబడతాయని గుర్తు చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ లక్కీ డ్రాలు నిర్వహించే వారితో పాటు, వాటిని ప్రమోట్ చేసే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సెలబ్రిటీ అయినా సరే ఉపేక్ష లేదు..

తాము ప్రసిద్ధులమన్న అహంకారంతో ప్రజలను మోసం చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్లు, యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని అమాయకుల ఆశలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజలు అధిక లాభాలు, ఖరీదైన బహుమతుల పేరుతో వచ్చే ఆన్‌లైన్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లక్కీ డ్రాలు, స్కీముల నుంచి దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.