manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 1:30 pm Editor : manabharath

బీజేపీతో కలిసేది లేదు: ఎంఐఎం అధినేత ఒవైసీ స్పష్టం

మన భారత్ తెలంగాణ: మహారాష్ట్రలో బీజేపీ లేదా ఎన్డీయేతో ఎలాంటి పొత్తు ఉండదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తేల్చిచెప్పారు. తమ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదని స్పష్టం చేస్తూ, ఏ కూటమితోనూ కలిసి వెళ్లే ప్రశ్నే లేదని అకోట్లో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో ఎంఐఎం బలంగా ఎదిగిందని ఒవైసీ పేర్కొన్నారు. “మహారాష్ట్రలో 125 మంది కార్పొరేటర్లను మా పార్టీ టికెట్‌పై గెలిపించుకున్నాం. ఇందులో ముస్లింలతో పాటు హిందువులు కూడా ఉన్నారు. ఇది మా పార్టీపై అన్ని వర్గాల ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం” అని అన్నారు.

ఎన్నికల నిర్వహణపై వస్తున్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. ఓటర్ల జాబితా విషయంలో ఎలాంటి సందేహాలు లేవని, జాబితాలను తాము స్వయంగా పరిశీలించి వెరిఫై చేశామని వెల్లడించారు. ప్రజాస్వామ్య విలువలు, మైనారిటీల హక్కుల పరిరక్షణే ఎంఐఎం ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

భవిష్యత్ రాజకీయాల్లో సిద్ధాంతాల ఆధారంగానే ముందుకు వెళ్తామని, అవకాశవాద రాజకీయాలకు తాము దూరమని ఒవైసీ పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు అనే ప్రచారానికి ఇకపై తావులేదని ఆయన వ్యాఖ్యలు స్పష్టమైన సంకేతంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.