manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 12:46 pm Editor : manabharath

1947 నుంచి కొనసాగుతున్న ఆదివాసీ సంప్రదాయం..

కేస్లాపూర్‌లో నాగోబా దేవత మహాపూజ..

మన భారత్ ఆదిలాబాద్ : జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. 1947 సంవత్సరం నుంచి ఆదివాసీ మెస్రం వంశీయుల ఆరాధ్య దైవమైన శ్రీ నాగోబా దేవత పుణ్యక్షేత్రంగా కేస్లాపూర్ విరాజిల్లుతోంది. తరతరాలుగా మెస్రం వంశీయులు ఈ క్షేత్రాన్ని పవిత్రంగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ ఆచారాలను కాపాడుకుంటున్నారు.

నాగోబా దేవతను గిరిజనుల ఆత్మీయ దైవంగా భావిస్తారు. ప్రకృతి ఆరాధన, సామూహిక ప్రార్థనలు, సంప్రదాయ పూజా విధానాలు ఈ క్షేత్ర ప్రత్యేకత. ఏటా పుష్య మాసాన్ని పురస్కరించుకొని మహాపూజ నిర్వహించి నాగోబా జాతరను అధికారికంగా ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఏడాది కూడా పుష్య మాస మహాపూజను ఆదివారం (రేపు) ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. సంప్రదాయ వేషధారణ, పూజా కార్యక్రమాలు, దేవతకు ప్రత్యేక నైవేద్యాలతో కేస్లాపూర్ గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకోనుంది.

నాగోబా జాతర కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమే కాకుండా ఆదివాసీ సంస్కృతి, ఐక్యత, సామాజిక జీవన విధానానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం భవిష్యత్ తరాలకు ఆదివాసీ గుర్తింపును అందిస్తూ కేస్లాపూర్‌ను తెలంగాణలో ప్రముఖ గిరిజన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెడుతోంది.