manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 1:25 pm Editor : manabharath

కొరట చనక ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రారంభం..

ఆదిలాబాద్‌కు సాగునీటి ఊతం

మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనమల రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం హత్తి–హత్తీ ఘాట్ వద్ద నిర్మించిన కొరట చనక ప్రాజెక్టు పంప్ హౌస్ ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రితో కలిసి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ గోడం నగేష్ గారు పంప్ హౌస్‌ను ప్రారంభించారు.

ప్రాజెక్టు ద్వారా ప్రాంతానికి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు పడిందని నాయకులు పేర్కొన్నారు. రైతులకు నీటి అందుబాటు పెరగడంతో వ్యవసాయ ఉత్పత్తి మెరుగు పడనుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమాన్ని ప్రధాన అజెండాగా తీసుకుని సాగునీటి ప్రాజెక్టుల వేగవంతానికి కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్, జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటి పెళ్లి గంగాధర్ రావు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

కొరట చనక ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెరిగి, రైతుల ఆదాయం వృద్ధికి బాటలు వేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.