manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 12:28 pm Editor : manabharath

2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం: సీఎం

మన భారత్ ,తెలంగాణ: నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోయిన వారి గురించి మాట్లాడదలుచుకోలేదని, పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “నాకు ప్రజలు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించడమే నా లక్ష్యం. ఇతరులపై విమర్శలు చేసి సమయాన్ని వృథా చేయను” అని స్పష్టం చేశారు.

రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో తిరిగి విజయం సాధించి, 2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. పాలనలో స్థిరత్వం, అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ప్రకటించిన సీఎం, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి జిల్లాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో రైతాంగానికి లాభం చేకూరడంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు. మౌలిక వసతులు, సాగునీరు, ఉపాధి కల్పనలో ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో ముందుకెళ్తోందని తెలిపారు.

ప్రజల విశ్వాసమే తమ బలం అని పేర్కొన్న సీఎం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పిలుపునిచ్చారు.