manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 11:57 am Editor : manabharath

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి తక్షణమే నిధులు మంజూరు చేయాలి

మన భారత్, తెలంగాణ: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన కీలక నిధులను వెంటనే మంజూరు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి సమగ్ర వినతిపత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, బోథ్ నియోజకవర్గంలో సాగునీటి, మౌలిక వసతులు, విద్య, భద్రత రంగాల్లో అభివృద్ధి అత్యవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా కుప్టి ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని, పిప్పలకోటి భూ నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని వెంటనే అందజేయాలని కోరారు. అలాగే బజార్ హత్నూర్ మండలంలోని దేగామ ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గంలో సాగునీటి వసతుల విస్తరణ కోసం నూతనంగా 60 చెరువులను మంజూరు చేయాలని, ఇప్పటికే మంజూరైన 28 చెరువులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పిప్రి, తేజపూర్, బుగ్గారం, సుంకిడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.

అలాగే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడంతో పాటు, బరంపూర్ నుంచి మోర్ఖండి, సిరిచేల్మా నుంచి పెంబి వరకు రోడ్ల అభివృద్ధికి అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా బోథ్‌లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, విద్యారంగ అభివృద్ధి కోసం నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయాలని కూడా కోరారు.

బోథ్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విన్నవించారు.