manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 January 2026, 11:14 am Editor : manabharath

💥 భార్యాభర్తల గలీజ్ దందా..!

💥 భార్యాభర్తల గలీజ్ దందా భండాఫోర్..!

సోషల్ మీడియాలో వల వేసి శృంగార వీడియోలతో బెదిరింపులు – మూడు ఏళ్లలో వంద మందికిపైగా బాధితులు

మన భారత్, తెలంగాణ | కరీంనగర్ / మంచిర్యాల

సామాజిక మాధ్యమాలను అడ్డుగా పెట్టుకుని భార్యాభర్తలు కలిసి సాగించిన బ్లాక్‌మెయిల్ దందా వెలుగులోకి వచ్చింది. పురుషులను ఆకర్షించి శృంగారానికి పాల్పడి, రహస్యంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ లక్షల రూపాయలు వసూలు చేసిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకటరావుపేటకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి కరీంనగర్‌లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ పనులు నిర్వహించేవాడు. ఇతనికి మంచిర్యాలకు చెందిన 29 ఏళ్ల మహిళతో వివాహం కాగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు రుణంతో కొనుగోలు చేసిన ప్లాట్ల ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే దంపతులు అక్రమ మార్గాన్ని ఆశ్రయించినట్లు పోలీసులు తెలిపారు.

భార్య సామాజిక మాధ్యమాల్లో పురుషులను ఆకర్షించేలా పోస్టులు చేస్తూ పరిచయాలు పెంచుకుంది. ఆమె వలలో పడిన కొందరు వ్యాపారులు, యువకులను తన అపార్ట్మెంట్‌కు పిలిపించి సన్నిహితంగా మెలిగేది. ఆ సమయంలో భర్త రహస్యంగా వీడియోలు చిత్రీకరించేవాడు. అనంతరం బాధితులకు ఫోన్ చేసి వీడియోలు బయటపెడతామంటూ బెదిరింపులకు పాల్పడి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

గత మూడు సంవత్సరాలుగా ఈ విధానంలో సుమారు 100 మందికిపైగా పురుషులను బ్లాక్‌మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారిని ఇప్పటికే రూ.13 లక్షలు దండుకున్న దంపతులు, మరోసారి రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మరిన్ని బాధితులు ఉండే అవకాశముందని, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.