manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 5:45 pm Editor : manabharath

హెల్మెట్ ధరించాలని పోలీసుల బైక్ ర్యాలీ..

నిర్లక్ష్యం వద్దు… హెల్మెట్‌ ధరించడం ముద్దు

మన భారత్ | తాంసి

ప్రతి ఒక్క వాహనదారుడు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి ప్రయాణాలు చేపట్టాలని ఆదిలాబాద్‌ రూరల్‌ సీఐ ఫణిదర్‌ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం తాంసి మండల కేంద్రంలో హెల్మెట్‌ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై జీవన్‌ రెడ్డితో కలిసి వాహనదారులకు హెల్మెట్‌ ప్రాధాన్యతను వివరించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో హెల్మెట్‌ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని, రోడ్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అవగాహన కార్యక్రమంలో భాగంగా తాంసి మండల కేంద్రంలోని పలు వీధుల గుండా హెల్మెట్‌ ధరించి వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తమతో పాటు కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని పిలుపునిచ్చారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులే కాకుండా ప్రజలందరూ భాగస్వాములు కావాలని సీఐ ఫణిదర్‌ కోరారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు అరుణ్‌, సంతోష్‌ రెడ్డితో పాటు ఆయా గ్రామాల యువత, పోలీసు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.