manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 9:36 am Editor : manabharath

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి–సర్కార్ భరోసా!

మన భారత్, తెలంగాణ స్టేట్ బ్యూరో:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ భరోసా ఇచ్చింది. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుమారు 5.14 లక్షల మంది శాశ్వత పర్మినెంట్ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ నిర్ణయం తీసుకున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, విధి నిర్వహణలో గానీ, ఇతర ప్రమాదాల్లో గానీ ఉద్యోగి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలుకాకుండా నిలబడేలా ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని తీసుకొస్తోందని తెలిపారు.

కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ఈ ప్రమాద బీమా పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం లోతైన సంప్రదింపులు జరిపినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. రాష్ట్రం అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా ప్రతినెలా విడుదల చేస్తూ వస్తోందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. జీతాల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర అలవెన్సులను కూడా సమయానుకూలంగా సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు.

ఈ ప్రమాద బీమా పథకం ద్వారా ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని కీలక రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ తరహా కోటి రూపాయల బీమా రక్షణ అమలులో ఉందని చెప్పారు. సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న 38 వేల మంది రెగ్యులర్ కార్మికులకు, విద్యుత్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న 71,387 మంది ఉద్యోగులకు ఇప్పటికే ఈ ప్రయోజనం అందుతోందని వివరించారు.

వారి తరహాలోనే సాధారణ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 5.14 లక్షల మంది ఉద్యోగులకు కూడా రూ.1.02 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భరోసా, సామాజిక భద్రత చేకూరనుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.