మేడారం భక్తులకు టోల్ గేట్ భారం?
మన భారత్ మేడారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులపై టోల్ గేట్ చెల్లింపులు అదనపు భారం కాబోతున్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహాజాతరకు కోట్లాది మంది భక్తులు తరలిరానుండటంతో, జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద వాహనాలను ఆపి వసూళ్లు చేపడితే భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేడారం జాతర సమయంలో టోల్ ఫీజును పూర్తిగా మినహాయించాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫీజు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే వాహనాలకు మాత్రమే వర్తింపజేయాలని కోరడంపై సోషల్ మీడియాలో తెలంగాణ వాదుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న నేపథ్యంలో, జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఊరట కలిగించేలా టోల్ ఫీజు మినహాయింపుపై ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
“సంక్రాంతి సందర్భంగా ఏపీ వైపు వెళ్లే వాహనదారులకే కాదు, మన తెలంగాణ గడ్డపై జరిగే అతిపెద్ద జాతర అయిన మేడారానికి వచ్చే భక్తుల కోసం కూడా టోల్ ఫీజు మినహాయింపుపై కసరత్తు చేస్తున్నాం” అని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం కేవలం ఒక ప్రాంతం ప్రయోజనాలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వివరించారు.

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్హెచ్ఏఐ (NHAI) పరిధిలోకి వస్తాయని గుర్తు చేసిన మంత్రి, పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసినట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ వివక్ష లేదని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను ప్రభుత్వం పట్టించుకోదని, ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించడమే తమ లక్ష్యమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ ఏడాది మేడారం జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి విస్తృత ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.
మేడారం భక్తులకు తాగునీరు, రవాణా, పారిశుధ్యం, భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టోల్ ఫీజు మినహాయింపు అమలైతే ప్రైవేటు వాహనాల్లో జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఆర్థికంగా భారీ ఊరట లభించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.