manabharath.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 3:11 pm Editor : manabharath

ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేపు కీలక విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేపు కీలక విచారణ

మన భారత్, తెలంగాణ | ప్రత్యేక కథనం

తెలంగాణలో రాజకీయంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపుకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ రేపు జరగనుందని న్యాయవర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి హరీశ్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ గతంలో చక్రధర్ గౌడ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసుపై హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించగా, అప్పట్లో హైకోర్టు కేసును కొట్టివేసింది. అయితే, ఆ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

అదే సమయంలో, ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కూడా విచారణకు రానుంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యాయ ప్రక్రియ మరింత కీలక దశకు చేరుకుందని రాజకీయ, న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

రేపటి విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.