ప్రధాని మోదీకి సీపీఐ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాల్సిందే: కేంద్ర మంత్రి బండి సంజయ్
మన భారత్, తెలంగాణ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ వేదికపై చేసిన వ్యాఖ్యలకు కూనంనేని తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రధానిపై సీపీఐ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడినవని, అసభ్యకరమైన భాష ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణ కోల్పోయిందని విమర్శించారు. అసెంబ్లీలో ఈ తరహా వ్యాఖ్యలకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలను స్పీకర్ అనుమతించడం బాధాకరమని బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, మిత్రపక్షాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యవహారం చోటుచేసుకుందని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ గౌరవం పెరిగిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో భారత్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. దీనిని జీర్ణించుకోలేక కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు రాజకీయ దూషణలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
కూనంనేని సాంబశివరావు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని దేశ ప్రజలకు, అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.