చట్ట వ్యతిరేక చర్యలపై కఠిన చర్యలు : ఎస్పీ అఖిల్ మహాజన్
మన భారత్, ఆదిలాబాద్:
గ్రామాభివృద్ధి పేరుతో ఏర్పాటు చేస్తున్న వీడీసీలు (విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు) రాజ్యాంగ విరుద్ధమని, అవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టంచేశారు. ప్రజల హక్కులను హరించే విధంగా ఎవరు వ్యవహరించినా చట్టం తన పని చేస్తుందని హెచ్చరించారు.
వీడీసీల పేరుతో అక్రమ వసూళ్లు, బెల్టు షాపులు, కళ్లు దుకాణాలు, ఇసుక తవ్వకాలపై అనధికారిక అనుమతులు ఇవ్వడం పూర్తిగా నేరమని ఎస్పీ తెలిపారు. ఇటువంటి చర్యలు గ్రామాల్లో శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
ప్రభుత్వ నిబంధనలు, స్థానిక సంస్థల అధికార పరిధిని పక్కనపెట్టి వీడీసీలు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఎస్పీ పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పేరుతో ప్రజలను భయపెట్టి లేదా ఒత్తిడికి గురిచేస్తే అది నేరమేనని స్పష్టం చేశారు. చట్టబద్ధమైన విధానాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని సూచించారు.
వీడీసీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు ఎలాంటి భయాలు లేకుండా జిల్లా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. ఫిర్యాదులు అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.