- కుచులాపూర్లో గాయత్రీ యజ్ఞం సత్సంగ సమ్మేళనం
మన భారత్, తెలంగాణ: శ్రీ సత్యమేవ జయతే ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాయత్రీ యజ్ఞం సత్సంగ సమ్మేళనం కుచులాపూర్ గ్రామంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రీ మాత పల్లకి నామస్మరణ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది.
ఈ కార్యక్రమానికి సత్యమేవ జయతే ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి నందన కృపాకర్, వలిశెట్టి లక్ష్మీ శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ పెద్దలు రమేష్ ప్రకాష్తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, అమ్మగార్లు యజ్ఞంలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.
అనంతరం ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి ఇచ్చిన అమృత వచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశం, ధర్మం, ఆధ్యాత్మిక విలువలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావిస్తూ, మతమార్పిడులు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వారి ప్రవచనాలు గ్రామస్తుల్లో దేశభక్తి, ధర్మ పరిరక్షణపై బలమైన విశ్వాసాన్ని నింపాయి.
ఈ సందర్భంగా కుచులాపూర్ గ్రామం తరఫున ఫౌండేషన్లో గోశాల కమిటీ, యువ కమిటీ, వానర కమిటీ, భజన కమిటీలను ఏర్పాటు చేసి, అందరూ ఒక తాటిపై కలిసి దేశం, ధర్మం కోసం సమిష్టిగా పని చేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెరిక పొచ్చన్న, కొత్త మల్లేష్, ఆర్. రాములు, ఎం. వెంకన్న, ఆర్. దీపక్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.