వేడుకల వేళ పూర్తి అప్రమత్తతతో 108 అంబులెన్స్ సేవలు
నూతన సంవత్సరానికి ప్రత్యేక ప్రణాళిక అమలు
మన భారత్, ఆదిలాబాద్ : నూతన సంవత్సరం సహా ఇతర వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో 108 అంబులెన్స్ సేవలు పూర్తి అప్రమత్తతతో కొనసాగుతున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి వైద్య అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు వెల్లడించారు.
డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, అకస్మాత్తు అనారోగ్యాలు, గుండె సంబంధిత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విలువైన ప్రాణాలు కాపాడేలా అంబులెన్స్ సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచినట్లు తెలిపారు.

108 సేవల నిర్వహణలో ప్రోగ్రాం మేనేజర్ సమ్రాట్ పర్యవేక్షణలో సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాల్స్ వచ్చిన వెంటనే వేగంగా స్పందించేలా అన్ని అంబులెన్స్ బృందాలను సన్నద్ధం చేశామని చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు గిరిజన, దూర ప్రాంతాల్లో కూడా సేవలు అందేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
వేడుకల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 108 నంబర్కు కాల్ చేయాలని జిల్లా అధికారులు సూచించారు.