జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు..
మన భారత్, తెలంగాణ: తెలంగాణ శాసనసభ సమావేశాలను జనవరి 7 వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో నిర్ణయించారు. కొత్త సంవత్సరంలో మొత్తం ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 4న (ఆదివారం) సెలవు ఉండనుంది.
అయితే, అసెంబ్లీ సమావేశాల వ్యవధిపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కనీసం 15 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలపై విస్తృతంగా చర్చ జరగాలంటే తక్కువ రోజులు సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
కొత్త సంవత్సరంలో జరగనున్న ఈ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, హామీల అమలుపై చర్చలు కీలకంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.