manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 10:38 pm Editor : manabharath

కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..!

డ్రగ్స్ కేసులపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్.. ప్రభుత్వాన్ని నిలదీసిన కేంద్రమంత్రి

మన భారత్, హైదరాబాద్:

డ్రగ్స్ కేసుల అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పండుగల వేళ డ్రగ్స్ కేసులు నమోదు చేయడం వెనుక ఉద్దేశమేంటని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో గతంలో జరిగిన డ్రగ్స్ కేసుల విచారణకు ఏమైంది..? అని ప్రశ్నించిన బండి సంజయ్, అప్పట్లో అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయని గుర్తు చేశారు. ఆ కేసుల్లో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తమతోపాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా డ్రగ్స్ తీసుకున్నారని నిందితులు వాంగ్మూలం ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.

నిందితుల వాంగ్మూలాలను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేసినప్పటికీ, తమ కుటుంబ సభ్యుల భవిష్యత్ నాశనం అవుతుందనే భయంతోనే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ కేసును నీరుగార్చారని బండి సంజయ్ ఆరోపించారు. అకున్ సబర్వాల్‌ను డ్రగ్స్ కేసు దర్యాప్తు నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు.

అకున్ సబర్వాల్ సేకరించిన కీలక ఆధారాలు, వీడియో స్టేట్‌మెంట్లను అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ ఆధారాలు ఇప్పుడు ఎక్కడున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సోమేశ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని ఆయన కోరారు.

డ్రగ్స్ కేసులో ఈగల్ టీమ్ నిజంగా లీగల్‌గా విధులు నిర్వహిస్తోందా..? అంటూ బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈగల్ టీమ్‌లో కొంతమంది డ్రగ్ పెడ్లర్లతో రాజీపడుతున్నారన్న ఆరోపణలు కూడా చేశారు. డ్రగ్స్ నిర్మూలనలో నిజాయితీగా పని చేయాలంటే అకున్ సబర్వాల్‌కు తిరిగి డ్రగ్స్ కేసుల బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.