manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 10:12 pm Editor : manabharath

శబరిమల మకరజ్యోతి దర్శనం ఎప్పుడో తెలుసా..?

శబరిమల మకరజ్యోతి దర్శనం ఎప్పుడంటే..? భక్తులకు కీలక సమాచారం

మన భారత్, స్టేట్ బ్యూరో: అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురుచూసే శబరిమల మకరజ్యోతి దర్శనం 2026 సంవత్సరంలో జనవరి 14వ తేదీన జరగనుంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా పొన్నాంబలమేడు వద్ద ఈ పవిత్ర జ్యోతి దర్శనమిస్తుందని దేవస్వం బోర్డు వర్గాలు వెల్లడించాయి.

సంప్రదాయం ప్రకారం, జనవరి 14వ తేదీ సాయంత్రం 6:30 గంటల నుంచి 6:55 గంటల మధ్య మకరజ్యోతి దర్శనం జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ దివ్య దృశ్యాన్ని దర్శించుకోవడం కోట్లాది అయ్యప్ప భక్తుల ఆకాంక్షగా భావిస్తారు.

మకరజ్యోతి దర్శనార్థం శబరిమలకి వచ్చే భక్తులు తప్పనిసరిగా ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దేవస్వం బోర్డు సూచించింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భద్రతా ఏర్పాట్లతో పాటు దర్శన విధానాన్ని క్రమబద్ధీకరించినట్లు అధికారులు తెలిపారు.

జనవరి 19వ తేదీ రాత్రి వరకు అయ్యప్ప స్వామి దర్శనానికి అవకాశం ఉండగా, జనవరి 20వ తేదీన శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భక్తులు తమ యాత్రను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

మకరజ్యోతి దర్శనం సందర్భంగా శబరిమల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.