బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ – బీజేపీలో చేరిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోదరుడు జ్ఞానేశ్వర్
మన భారత్, ఆదిలాబాద్:
అదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోథ్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్ గారి సోదరుడు జాదవ్ జ్ఞానేశ్వర్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి మరో పెద్ద షాక్ తగిలినట్లయింది.
అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ గారు జాదవ్ జ్ఞానేశ్వర్కు పార్టీ కండువా కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ అమలు చేస్తున్న ప్రజాపక్ష పాలన కార్యక్రమాలు నచ్చి జ్ఞానేశ్వర్ బీజేపీలో చేరడం హర్షణీయమన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు ముగ్గురు సోదరులు ఉండగా, అందులో ఒకరైన జాదవ్ జ్ఞానేశ్వర్ బీజేపీ గూటికి చేరడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికతో ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బలపడనుందని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ మార్పు ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలన్న లక్ష్యంతోనే బీజేపీలో చేరినట్లు జ్ఞానేశ్వర్ తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.